టాలీవుడ్‌లో పర్సంటేజీ వివాదం.. స్పందించిన దిల్ రాజు

  • సమస్యపై చర్చించి పరిష్కరించుకున్నామన్న దిల్ రాజు
  • ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య ఫిల్మ్ ఛాంబర్‌లో సమావేశం జరిగిందని వెల్లడి
  • ఎగ్జిబిటర్లు కోరుతున్న పర్సంటేజీ విధానానికి నిర్మాతలు సానుకూలంగా ఉన్నట్లు వెల్లడి
  • పెద్ది సినిమా ఆరోగ్యకరమైన వాతావరణంలో విడుదలవుతుందని హామీ
ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య కొనసాగుతున్న పర్సంటేజీ విధానం వివాదంపై ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు స్పందించారు. ఈ సమస్యపై చర్చించి పరిష్కరించుకున్నామని తెలిపారు. ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య ఫిల్మ్ ఛాంబర్‌లో సమావేశం జరిగిందని, పర్సంటేజీ విధానంపై చర్చించామని అన్నారు. ఎగ్జిబిటర్లు కోరుతున్న పర్సంటేజీ విధానానికి నిర్మాతలు అభ్యంతరం చెప్పడం లేదని తెలిపారు.

పర్సంటేజీ విధానానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని దిల్ రాజు అన్నారు. ఏ, బీ, సీ ఇలా ఆయా సెంటర్లలో థియేటర్‌ను బట్టి పర్సంటేజీని కమిటీ నిర్ణయిస్తుందని వెల్లడించారు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'పెద్ది' చిత్రం జూన్ 4న ఆరోగ్యకరమైన వాతావరణంలోనే విడుదలవుతుందని పేర్కొన్నారు. ఆ విషయంలో ఎలాంటి సందేహం అక్కరలేదని అన్నారు.

మల్టీప్లెక్స్‌లో ఉన్నట్లే సింగిల్ స్క్రీన్‌లలో కూడా పర్సంటేజీ విధానం కావాలని, దీనికి అంగీకరించిన సినిమాలనే ప్రదర్శిస్తామని తెలంగాణ ఎగ్జిబిటర్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పర్సంటేజీ విధానంతో తమకు నష్టం కలుగుతుందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో విడుదల కానున్న 'పెద్ది' సినిమాను లక్ష్యంగా చేసుకుని ఈ డిమాండ్ తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఈ క్రమంలో 'పెద్ది' సినిమా ఆరోగ్యకర వాతావరణంలో విడుదలవుతుందని దిల్ రాజు హామీ ఇచ్చారు.

Dil Raju
Telugu cinema
Tollywood
percentage system
exhibitors
producers
film chamber
Peddhi movie

More Telugu News